భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ తెలంగాణ మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం
క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 5
మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ కు కేబినేట్ ఆమోదం
•కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆర్థికవేత్త, మాజీ ఆర్బిఐ గవర్నర్, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పేరు
* ముఖ్యమంత్రి రేవంత్ కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు
•ప్రపంచ స్థాయిలో మారుమోగునున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖ్యాతి
•ఆనందోత్సవాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు
కొత్తగూడెం, జూన్ 5,:
భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ తెలంగాణ మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మార్చింది. ఇపుడు మరో ముందడుగు వేసి యూనివర్సిటీకి , ప్రముఖ ఆర్థిక వేత్త, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పేరును ఖరారు చేసింది. క్యాబినెట్ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు హార్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు మంత్రిమండలి సభ్యులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం కు భారత ప్రధాని పేరు నామకరణం చేయడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించునుంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం....
సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపు దిద్దుకుంది. అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారింది. ప్రస్తుతం ఈ మైనింగ్ కళాశాల మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందడంతో వేలాది మంది యువ శాస్త్రవేత్తల ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేయనున్నారు. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషించనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి విశ్వవిద్యాలయం ఒక అమెరికాలో మాత్రమే ఉన్నది.
యూనివర్సిటీలో అందించనున్న కోర్సులు
అండర్ గ్రాడ్యుయేట్ (బి ఎస్సి.) ప్రోగ్రాంలో జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, పీజీ (ఎం ఎస్ సి.) ప్రోగ్రాంలో జీయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, పీ హెచ్ డి. ప్రోగ్రాంలో యూజీసీ నిబంధనల ప్రకారం కోర్సులను అందించడంతో పాటు ఇప్పటికే బి.టెక్ ప్రోగ్రాంలో ఉన్న మైనింగ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లలో ప్రతి కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లతో విద్యనందించనున్నారు.
మంత్రి తుమ్మల కృషి
మైనింగ్ కళాశాలను విశేష విశ్వవిద్యాలయంగా మార్చడంలో మంత్రి తుమ్మల కృషి చేశారు. అలాగే మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం పట్ల మంత్రి తుమ్మల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అపర చాణిక్యుడిగా...అభివృద్ధి ప్రధాతగా, విజన్ కలిగిన నేతగా జిల్లాలో మంత్రి తుమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అభివృద్ధిలో పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేయడం ఆయన నైజం. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక వ్యవహార శైలి కలిగిన మంత్రి తుమ్మల అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ప్రధాతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు ఆయన శ్రమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు ముఖ్యమంత్రిని ఒప్పించి కృతకృత్యులయ్యారు.
యువతకు ఉద్యోగం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టనుంది. మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మంజూరు చేయడంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయి. వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతో పాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
దేశ స్థాయిలో ఖ్యాతి...
భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విద్యాలయానికి అన్ని వనరులు అవకాశాలతో పాటు దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును ఖరారు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం పేరు మారు మ్రోగనుంది. కొత్తగూడెంలో బొగ్గుతో పాటు అన్ని సహజ వనరులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఖనిజనిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఈ జిల్లాలో ఉన్నాయి. నేషనల్ హైవేకి సమీపంలో 300 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి సమీపంలో మినీ స్టిల్ ప్లాంట్, నవభారత్ లిమిటెడ్ , ఫెరో ఎల్లాయి, ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు కూడా మరో 300 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు మరియు రైలు రవాణా మార్గాలు ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండవు.
Comment List